Srisailam | శ్రీశైలంలో భ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల దేవస్థానంలో లోక క్షేమాన్ని కాంక్షిస్తూ పరివార దేవుళ్లకు శాస్త్రోక్తంగా వార పూజలు జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న కుమారస్వామికి మంగళవారం ఉదయం పూజాది క్రతువులు చేశారు. సాయంకాలం క్షేత్రపాలకుడైన బయలు వీరభద్రస్వామికి ప్రదోషకాలంలో అభిషేక అర్చనలు జరిపించారు.
ఆరు బయట ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చే స్వామికి ఉదక స్నానం చేయించి విశేష పుష్పార్చన అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందించారు. అనంతరం సంధ్యా సమయంలో నందిమండపం వద్ద కొలువైన శనగల బసవన్నకు ప్రత్యేక క్రతువులు నిర్వహించారు.
ప్రజలు సుఖసంతోషాలతో బాసిల్లాలని కోరుతూ అర్చకపండితులు మహా సంకల్పాన్ని పఠించి పంచామృతాలు, ఫలోదకాలతోపాటు మల్లికాగుండంలోని శుద్దజలంతో అభిషేకం చేశారు. అనంతరం నందీశ్వరునిపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అధిష్టించి అష్టోత్తర శత నామ పూజలు జరిపి నూతన వస్త్రాన్ని సమర్పించి నానబెట్టిన శనగలు నైవేద్యంగా సమర్పించారు.