అమరావతి : ఏపీ కాంగ్రెస్, అధికార వైసీపీల మధ్య సెటైర్ల యుద్ధం కొనసాగుతుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల( YS Sharmila) తన అన్న ఏపీ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Jagan) పై నిత్యం ఆరోపణలు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అదేస్థాయిలోనూ సీఎంతో పాటు మంత్రులు, పార్టీ నాయకులు షర్మిల వ్యాఖ్యలను తమదైన శైలీలో విరుచుకుపడుతున్నారు.
తాజాగా శనివారం షర్మిల వైఎస్సార్ అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. వై అంటే వైవీ సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే రామకృష్ణరెడ్డి సజ్జల అంటూ సెటైర్లు విసిరారు. ప్రకాశం ( Prakasam District) జిల్లాలో పర్యటిస్తున్న ఆమె కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమనైనా తీసుకురాలేదని పేర్కొన్నారు.
ఒక్క జాబ్ నోటిఫికేషన్ ( Job Notification) అయిన వచ్చిందా అంటూ జనాలను ప్రశ్నించారు. ఎన్నికల ముందు డీఎస్పీ నోటిఫికేషన్ ఇస్తామంటున్నారని, ఈ ఐదేళ్లలో ఏం చేశారని నిలదీశారు. మద్యపాన నిషేధం చేయకపోతే మళ్లీ ఓటు అడగనూ అని అధికారంలో వచ్చిన జగన్ మాట తప్పారు. మడప తిప్పారని ఎద్దేవా చేశారు.