అమరావతి : విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమాత ఆలయంలో శాకంబరి ఉత్సవాలు శనివారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల తొలిరోజు శనివారం అమ్మవారి మూలవిరాట్ సహా ఆలయాన్ని కూరగాయలు, పండ్లతో అలంకరించారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, అంకురార్పణ నిర్వహించారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి కూరగాయలు, ఆకు కూరలు,నిమ్మకాయలను రైతులు ఆలయానికి విరాళంగా అందజేశారు.
ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేంగా అలంకరణ చేశారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు కదంబం ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. రాజగోపుర ప్రాంగణం, ఘాట్రోడ్డు మార్గం, ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలకు ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో శాకాంబరి దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
దేశం సస్యశ్యామలంగా ఉండి పాడిపంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరీ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన వర్షిణి, సాయి సహస్రలు 62 గ్రాముల బరువున్న బంగారు మామిడి పిందెల హారాన్ని ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్ రాంబాబుకు అందజేశారు.