అమరావతి : ఆంధ్రప్రదేశ్లో వరుస విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఇటీవల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో పది మందికి పైగా చనిపోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. తరుచూ జరుగుతున్న ఘటనలు మరిచిపోక ముందే శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.
జిల్లాలోని రొద్దంలో ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి బస్సుపై పడ్డాయి. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది . కాగా నిన్న బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో వాణి అనే మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందింది. భర్త ఓబుళేశుతో కలిసి మొక్కజొన్న పంటకు క్రిమిసంహారక మందు పిచికారీకి వెళ్లింది. నీళ్లు అవసరమై విద్యుత్ మోటర్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్కు గురై మృతి చెందింది. పెళ్లైన ఎనిమిది నెలలకే ఆమె మరణించడంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.