తూర్పుగోదావరి : జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న దంపతుల కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. లోన్ యాప్ ఆగడాల కారణంగానే దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వీరి ఆర్థిక లావాదేవీలకు సహకరిస్తున్న ఏడుగురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. లోన్ యాప్ నిర్వాహకులపై నిఘా పెట్టినట్లు తెలిపారు. పొరుగు రాష్ట్రాల్లో ఉంటూ యాప్ నిర్వాహకులు లావాదేవీలు చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.
దంపతుల ఆత్మహత్యకు కారణమైన హ్యాండీ లోన్, స్పీడ్ లోన్ యాప్లపై పోలీసులు ఆరా తీశారు. ఈ క్రమంలో మూడు పోలీసు బృందాలు పనిచేసి యాప్లకు మధ్యవర్తులు, రుణం తీసుకునే వారిని గుర్తించారు. నిందితులను గండిపేట మండలం మణికొండకు చెందిన లంబాడి నరేష్, మియాపూర్కు చెందిన కొల్లూరు శ్రీనివాస్ యాదవ్, కాకినాడ జిల్లా తిమ్మాపురానికి చెందిన మాడిశెట్టి పృథ్వీరాజ్, ఏలేశ్వరానికి చెందిన నక్కా సుమంత్, అన్నవరానికి చెందిన మంద వీరవెంకట హరిబాబు, విశాఖ జిల్లా కేకే అగ్రహారానికి చెందిన కొరుపోలుత రామకృష్ణ, అనకాపల్లి సమీపంలోని సిరసపల్లికి చెందిన దానబోయిన నిష్కర్ నిందితులుగా పోలీసులు గుర్తించారు. వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలించగా రూ. కోట్లలో నగదు లావాదేవీలు జరిగినట్లు తేలింది. బ్యాంకు అధికారులకు అనుమానం రాకుండా నిందితులు ప్రతి నెలా వేర్వేరు ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లోని యాప్ నిర్వాహకుల సమాచారం కూడా పోలీసులకు అందడంతో.. ఆ కోణంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో లోన్ యాప్ బాధితుల సంఖ్య పెరుగుతుండటంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించి లోన్ యాప్స్తో వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ నెల ఏడో తేదీన రాజమహేంద్రవరానికి చెందిన కొల్లి దుర్గారావు, రమ్యలక్ష్మి ఆత్మహత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేసి వారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేశారు.