తిరుమల : తిరుమల ( Tirumala ) లోని వివిధ ప్రాంతాల్లో భక్తులకు శ్రీవారి సేవకులు (Srivari Sevaks ) అందిస్తున్న సేవలు అమోఘమని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) ప్రశంసించారు. శుక్రవారం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఆమె అన్న ప్రసాదం స్వీకరించారు.
అన్న ప్రసాద కేంద్రం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, భాను ప్రకాష్ రెడ్డి, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. ఆమె భోజనశాల వద్దకు చేరుకుని శ్రీవారి సేవకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్న ప్రసాదాలను వడ్డించారు.
అన్న ప్రసాదం స్వీకరించిన అనంతరం టీటీడీ ఫీడ్ బ్యాక్ పుస్తకంలో తన అభిప్రాయాన్ని లిఖితపూర్వకంగా తెలిపారు. ఇతర భక్తులతో కలిసి అన్న ప్రసాదం స్వీకరించడం హృదయానికి హత్తుకుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.