తిరుమల : మోక్షం పొందేందుకు అంకితభావంతో నిస్వార్థ సేవలు అందించాలని శ్రీవారి సేవకులకు వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచించారు. తిరుమలలోని సేవాసదన్ -2లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒడిశాకు చెందిన జై గంగా లైఫ్ అకాడమీ నిర్వాహకులు కిరణ్ మాట్లాడుతూ శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులకు సేవకులు ఎనలేని సేవలు అందిస్తున్నారన్నారు.
ధ్యానం ద్వారా శరీరాన్ని, మనసును, ఆత్మను బలోపేతం చేసుకోవాలని, భక్తులకు మరింత ఉత్సాహంతో, భక్తితో సేవ చేయడానికి ఇది సహాయపడుతుందని అన్నారు. మరో శిక్షకురాలు మంగళ నారాయణి మాట్లాడుతూ నిస్వార్థ సేవ చేస్తూ జీవితాన్ని ఎలా సాగించాలో శ్రీవారి సేవ ఉత్తమ ఉదాహరణ అన్నారు. టీటీడీ పీఆర్వో డాక్టర్ టి.రవి, ఏపీఆర్వో కుమారి పి.నీలిమ, ఏఈవో నిర్మల, ఓఎస్డీ ఫణిరంగ సాయి, శ్రీవారి సేవకులు పాల్గొన్నారు.