అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను ఒప్పుకోవాలని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) డిమాండ్ చేశారు. చేసిన తప్పులకు బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన హితవు పలికారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు (Skill Development Case ) లో టీడీపీ నాయకులు చేస్తున్న రాద్ధాతంపై ఆయన స్పందించారు.
చంద్రబాబు నిజాయితీపరుడైతే కోర్టులో నిరూపించుకోవాలని సవాలు విసిరారు. రాజధాని (Capital), టిడ్కో ఇళ్ల నిర్మాణంలో కూడా భారీ అవినీతి జరిగిందని, ప్రజా ధనాన్ని అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. టీడీపీ పాలనలో అనేక స్కామ్లు జరిగాయని పేర్కొన్నారు. యుగ పురుషుడిలా బిల్డప్ ఇస్తావా అంటూ మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కేబినెట్ తీసుకున్న నిర్ణయమే అయినా ప్రభుత్వాధినేతకు బాధ్యత ఉండదా అంటూ ప్రశ్నించారు.
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత అవినీతి ఎక్కడా చూడలేదని ఆయన అన్నారు. పశ్చాత్తాపం లేకుండా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమకు ఎవరిపై రాజకీయ కక్ష లేదని పేర్కొన్నారు. తమకు ప్రజా సంక్షేమమే ప్రధానమని ఉద్ఘాటించారు.