అమరావతి : ఏపీలో ఏసీబీ అధికారులు దూకుడును పెంచుతున్నారు. బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదు మేరకు స్పందిస్తున్న అధికారులు అవినీతి అధికారుల భరతం పడుతున్నారు. ఇవాళ ఏపీలోని కర్నూలు నగరపాలక సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ సురేంద్రబాబు కార్యాలయంపై దాడులు నిర్వహించి అతడి ఛాంబర్లో దొరికిన రూ. 15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.
ఓ కాంట్రాక్టర్ చేపట్టిన రూ. 1.15 కోట్ల బిల్లుల మంజూరుకు ఎస్ఈ రూ. 15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు, కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా కర్నూలులోని నగర పాలక సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించి ఎస్ఈని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా అతడి కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు.