హైదరాబాద్: తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) శుభవార్త అందించింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. బుధవారం నుంచి 18వ తేదీ మధ్య కాచిగూడ-తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
రైలు నంబర్ 07597 కాచిగూడ స్పెషల్ జూన్ 15, 17 తేదీల్లో కాచిగూడలో రాత్రి 7 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మరో రైలు నంబర్ 07598 తిరుపతి-కాచిగూడ స్పెషల్ జూన్ 16, 18 తేదీల్లో తిరుపతిలో ఉదయం 10.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి 9.55 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు మల్కాజిగిరి, నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ ఉన్నాయి. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని హైదరాబాద్కు తిరిగి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఇప్పుడు మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అదేవిధంగా, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్- కలబుర్గి మధ్య ప్రత్యేక రైళ్లు, అలాగే హైదరాబాద్- కలబుర్గి-హైదరాబాద్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.