అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగల సందర్భంగా విద్యాసంస్థలకు ఇచ్చిన సెలవుల అనంతరం యథావిధిగా ప్రారంభమయ్యాయి. అయితే కొవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవుల పెంపుదలపై ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాలలను యథావిధిగా నడిపిస్తున్నామని వెల్లడించారు.
రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సిన్ వేయడం పూర్తి చేశామని, 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులకు 92శాతం వ్యాక్సిన్ను పూర్తి చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని పాఠశాలలు నడుపుతామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు.