తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల మాడ వీధులు కిటకిటలాడుతున్నాయి. శ్రీవారి సర్వదర్శనానికి 24 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిన్న స్వామివారిని 67,511 మంది భక్తులు దర్శించుకోగా 26,948 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.33 కోట్లు ఆదాయం వచ్చిందని వివరించారు.
28న తిరుమలలో రథసప్తమి
సూర్య జయంతి సందర్భంగా జనవరి 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం , ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై స్వామివారు ఊరేగుతారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారని వివరించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.