తిరుమల : తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు గురువారం నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం శ్రీదేవి(Sridevi), భూదేవి(Bhudevi) సమేత మలయప్పస్వామివారిని పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకువచ్చి హోమాలు(Homams) తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విగ్రహాలకు అభిషేకం చేశారు.

వేద పండితులు పంచసూక్తాలను పఠించారు. ఆ తర్వాత మొదటిరోజు పవిత్ర ప్రతిష్ట , మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేశారు. పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఇతర అధికారులు పాల్గొన్నారు.