తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని కల్యాణవేదిక వద్ద ఏర్పాటుచేసిన పలు ప్రదర్శనశాలలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఈవో ఎవి.ధర్మారెడ్డి ఇవాళ ప్రదర్శనశాలలలను ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ ప్రజాసంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్, ఇటీవల చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఫ్లెక్సీల ప్రదర్శన, పంచగవ్య ఉత్పత్తులు, ప్రచురణల ప్రదర్శన, విక్రయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
టీటీడీ అటవీ విభాగం ఆధ్వర్యంలో శేషాచలం నమూనా, నక్షత్రవనంలోని వివిధ మొక్కలు, ఎస్వీ ఆయుర్వే ద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ ఆధ్వర్యంలో వనమూలికా ప్రదర్శన, శ్రీ వేంకటేశ్వర శిల్పకళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిల్పకళాలలు ప్రదర్శనలో ఉంచినట్లు వెల్లడించారు. ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో వివిధ రంగుల, జాతుల పుష్పాలతో ఏర్పాటుచేసిన ప్రదర్శన రమణీయంగా ఉందన్నారు.
త్రిలోక దర్శనం, వివిధ పౌరాణిక ఘట్టాల సెట్టింగులు ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. మైసూరుకు చెందిన కళాకారిణి ఎంఎన్.గౌరి రూపొందించిన శ్రీకృష్ణుని విశ్వరూప దర్శనం సైకత శిల్పం భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు.