అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ. 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గత 30 ఏండ్లలో ఎప్పుడూ ఇంత భారీ వర్షం కురవలేదని అన్నారు. శేషాచలం కొండల్లోని వరద నీటి ప్రవాహంతో కపిల తీర్థం , తిరుపతిలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని ఆయన వెల్లడించారు.
ఘాట్రోడ్లలో 18 ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడగా, ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయని అన్నారు. దీంతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టామని ఆయన వివరించారు. భారీవర్షాలతో శ్రీవారి మెట్టు మార్గంలో రోడ్డు దెబ్బతిందని చెప్పారు. తిరుమలలోని పార్వేట మండపంలో ఆదివారం నిర్వహించాల్సిన కార్తీక వనభోజన కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.