ఎన్టీఆర్ జిల్లా : జిల్లాలోకి వివిధ ప్రాంతాల నుంచి చేరవేస్తున్న అక్రమ మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. దాదాపు రూ.2 కోట్ల విలువైన 63 వేల మద్యం బాటిళ్లను పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించారు. ఈ మద్యం అంతా గత రెండేండ్లుగా జిల్లాలో సీజ్ చేసినవి కావడం విశేషం.
జిల్లాలోకి అక్రమంగా రవాణా చేస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ధ్వంసం చేశారు. ఈ మద్యం విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. గత రెండేండ్లుగా జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి అక్రమ మద్యాన్ని సీజ్ చేశారు. మంగళవారం నాడు విజయవాడ శివారులోని రోడ్డుపై అక్రమ మద్యం బాటిళ్లను వరుసగా పేర్చి రోడ్డు రోలర్తో తొక్కించారు. స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిన మద్యం బాటిళ్లలో చీప్ లిక్కర్ మొదలుకొని కాస్ట్లీ మందు కూడా ఉండటం విశేషం.
ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండటంతో పలువురు సొమ్ము చేసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు. దీనిపై గత కొంతకాలంగా డేగ కన్ను పెట్టిన పోలీసులు జిల్లావ్యాప్తంగా ఎలాంటి అక్రమ మద్యం రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అక్రమ మద్యం లేకుండా చేసేందుకే కఠినంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల నందిగామలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.