Note For Vote in AP | ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు స్కాంపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఎన్నికల్లో రాజోలు నుంచి జనసేన తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేయడానికి రూ.10 కోట్లు ఆఫర్ చేసిందని రాపాక వరప్రసాద్ చెప్పారు. తన ఓటు అమ్మితే రూ.10కోట్లు వచ్చేదని అన్నారు. తన వద్ద డబ్బు ఉండి వద్దనలేదని, ఒకసారి పరువు పోతే సమాజంలో తిరగలేం అనే ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు ఆదివారం మీడియాకు చెప్పారు.
తన ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని రాపాక ఆరోపించారు. ఓటుకు నోటు కోసం మొదటి బేరం తనకే వచ్చిందన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు ద్వారా తనకు ప్రతిపాదన చేశారని చెప్పారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకి ఓటేయాలని, టీడీపీకి ఓటేస్తే మంచి పొజిషన్ ఉంటుందని ఓ రాజు గారు చెప్పారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు పడ్డాయా? అని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ప్రలోభ పెట్టకుండా వారు ఎలా ఓటేస్తారని రాపాక నిలదీశారు. అసెంబ్లీ ప్రాంగణంలో టీడీపీ ఎమ్మెల్యే తనతో మాట్లాడాడో లేదో సీసీటీవీ కెమెరాలు చెక్ చేయించండి అని సవాల్ చేశారు.
టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటే 23 ఓట్లు ఎలా వచ్చాయని రాపాక ప్రశ్నించారు. టీడీపీకి ఓట్లు కొనడం కొత్త కాదని చెప్పారు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఓట్లు కొనడానికి ప్రయత్నించి టీడీపీ దొరికిపోలేదా? అని నిలదీశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు హస్తం లేదా? అని ప్రశ్నించారు. తాను వీడియో వైరల్ చేసి ఎవరి మెప్పో పొందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. టీడీపీ 10 మంది ఎమ్మెల్యేల ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తే నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అన్నారు.
మెజారిటీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని రాపాక తెలిపారు. ముమ్మిడి వరం ఎమ్మెల్యే సతీశ్, మరోమంత్రికి ఓటుకు నోటు విషయం తెలియ చేశానని చెప్పారు.ఈ విషయం తాను మాత్రం తన పార్టీ అధిష్టానానికి చెప్పలేదని రాపాక అన్నారు. తన మిత్రులు చెప్పారో లేదో తెలియదని అన్నారు. తాను సీఎం జగన్ను నమ్ముకున్నందునే టీడీపీ ఆఫర్ ను తిరస్కరించానని తెలిపారు. టీడీపీ నేతలు ఓటుకు నోటు ఆఫర్ చేశారని రాపాక వర ప్రసాద్ చెప్పాక కొత్తగా చర్చలెందుకు అని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు.
రాపాక వర ప్రసాద్ ఆరోపణలకు టీడీపీ నేత బొండా ఉమా కౌంటరిచ్చారు. రాపాకను రూ.10 కోట్లకు కొనుగోలు చేసేదేవెరని ప్రశ్నించారు. రూ.10 వేలు కూడా ఎక్కువేనని ఎద్దేవాచేశారు. ఇదంతా తాడేపల్లి స్క్రిప్ట్ అని ఆరోపించారు. మున్ముందు రాపాక వంటి కృష్ణులు మీడియా ముందుకు వస్తారని చెప్పారు.