కాకినాడ జిల్లా: కొన్నాళ్లుగా దొరక్కుండా ముప్పుతిప్పలు పెడుతున్న పెద్దపులి ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. దాదాపు నెల రోజులకు పైగా కాకినాడ జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. కాకినాడ జిల్లా సరిహద్దుల్లోకి చేరిన నాటి నుంచి అటు అధికారులను, ఇటు ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. దీన్ని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
దాదాపు ఐదు వారాలుగా కాకినాడ జిల్లాలో బెంగాల్ టైగర్ అధికారులు, ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నది. బోనుకు చిక్కకుండా, కెమెరాల కంట పడకుండా తప్పించుకుంటున్నది. రోజుకో స్థలం మారుస్తుండటంతో అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తునికి సమీపంలోని కుమ్మరిలోవ కాలనీ వద్ద రోడ్డు దాటుతుండగా స్థానికులు పులిని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేసినట్లు తెలుస్తున్నది. అయితే, రెండు రోజుల క్రితం తుని ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా గుర్తించిన పారెస్ట్ అధికారులు.. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో దాని అడుగు జాడలను గుర్తించారు.
అంతుచిక్కని రాయల్ బెంగాల్ టైగర్ కాకినాడ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత గత నెల రోజులుగా తన భూభాగాన్ని మార్చుకుని అనకాపల్లి జిల్లా వైపు వెళ్లినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో గత నెల 23 నుంచి స్థానికులను ఈ పులి ఆందోళనకు గురిచేస్తున్నది. నక్కపల్లి మండలం తిరుపతిపాలెంలో పులి పంజా గుర్తులు కనిపించాయి. జిల్లాలోని పాయకరావుపేట ప్రాంతంలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తాడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో పులి సంచారాన్ని గుర్తించిన చుట్టుపక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాటపర్తి సమీపంలో గేదెపై దాడి చేసింది. అటవీశాఖ అధికారులు గ్రామస్తులను అప్రమత్తం చేసి రాత్రి పూట ఇళ్లలోనే ఉండాలని సూచించారు.