నెల్లూరు: బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో స్వర్ణాల చెరువు ఘాట్ జనసంద్రంగా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతున్నది. ఈ రొట్టెల పండుగ ఈ నెల 13 వరకు కొనసాగనున్నది. వివిధ కోరికలతో వచ్చే వారు ఈ దర్గాలో రొట్టెలు సమర్పించడం ద్వారా తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. దాంతో ఈ రొట్టెల పండుగలో పాల్గొనేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు.
గంధ మహోత్సవం పూర్తయిన తర్వాత పవిత్ర గంధాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. దీంతో చెరువు నీటికి పవిత్రత, రోగాలను హరించే శక్తి వస్తుందని భక్తులు నమ్ముతారు. స్వర్ణాల చెరువులో స్నానమాచరించి, ఆ నీటిని తలపై చల్లుకుని రొట్టెలు మార్చుకుంటారు. అయితే గంధ మహోత్సవం కంటే ఒక రోజు ముందుగానే రొట్టెలు మార్చుకునే కార్యక్రమం మొదలైంది. అధికారికంగా మాత్రం రొట్టెల పండుగ ఈ నెల 11 న జరుగుతుంది. 10 న గంధ మహోత్సవం, 12 న తమలీల్ ఫాతెహా కార్యక్రమాలు జరుగుతాయి.
రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం 2015 లోనే ప్రకటించింది. అందుకు అనుగుణంగా దర్గా వద్ద మౌలిక వసతులు కల్పిస్తున్నది. రొట్టెల పండగ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి, నగర మేయర్ పీ స్రవంతి ఆధ్వర్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో గత రెండేండ్లుగా రొట్టెల పండుగను జరపలేదు. దాంతో ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రొట్టెలను సమర్పిస్తున్నారు. దర్గాలో రొట్టెలు సమర్పించిన తర్వాత స్వర్ణాల చెరువు ఘాట్కు చేరుకుంటున్న భక్తులు.. అక్కడ తమ రొట్టెలను మార్చుకుంటున్నారు. ఆరోగ్య రొట్టె, ఐశ్వర్య రొట్టె, ఉద్యోగ రొట్టె, చదువు రొట్టె, వివాహ రొట్టె, సంతాన రొట్టె.. ఇలా వివిధ రొట్టెలను భక్తులు ఇతరులకు ఆశీర్వదించి ఇస్తుంటారు. కొర్కెలు తీరిన వారు తిరిగి ఈ దర్గాను సందర్శించి రొట్టెలు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తున్నది.