అమరావతి : ఏపీలోని ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినిమా ఫక్కీలో దుండగులు కారును వెంబడించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. అయితే దోచుకెళ్లిన సొత్తును దుండగులు కొంతదూరంలో కారులో వదిలో పారిపోయారు. నరసారావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు శనివారం రాత్రి నంద్యాల నుంచి నరసారావుపేటకు కారులో బయలు దేరారు.
వీరు ప్రయాణిస్తున్న కారును మరోకారులో వెంబడించిన ఆరుగురు సభ్యులు గల దుండగులు గిద్దలూరు మండలం దిగువమెట్ట చెక్పోస్టుకు కొంతదూరంలో వ్యాపారుల కారును ఆపారు. కారు అద్దాలను ధ్వంసం చేసి వ్యాపారులపై దాడి చేసి రూ. 45 లక్షలు నగదుతో పాటు 950 గ్రాముల బంగారాన్ని వ్యాపారస్థుల కారుతో ఉడాయించారు. అక్కడి నుంచి కొంతదూరం వెళ్లిన దుండగులు గిద్దలూరు మండలం కె.ఎస్ పల్లె వంతెన వద్ద కారును వదిలివెళ్లారు.
బాధితులు నంద్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు గిద్దలూరు పోలీసులకు సమాచారం అందించడంతో వారు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దుండగులు కారును వదిలి అక్కడినుంచి పారిపోయారు. కారును తనిఖీ చేయగా లాకర్లో దాచిన నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు గిద్దలూరు పోలీసులు తెలిపారు.