అమరావతి : రాష్ట్రంలో విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణ కారణంగా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఇవాళ ఏపీలోని నంద్యాల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. గడిచిన మూడు సంవత్సరాల్లో అనేక సంస్కరణలు చేపట్టామని చెప్పారు. పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కావొద్దన్న ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెనను ప్రారంభించామన్నా రు. పేదలకయ్యే ఫీజ్ రీయింబర్స్మెంట్ను పూర్తిగా అందజేసి తల్లిదండ్రులను ఆదుకుంటున్నామన్నారు.
కుటుంబంలోని ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ వసతి దీవెనను అందజేస్తామన్నారు. తల్లుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేయడం వల్ల కళాశాలల్లో సౌకర్యాలు మెరుగవుతాయని తెలిపారు. కళాశాలల్లో సౌకర్యాలు కల్పించకపోతే కళాశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియంగా మార్చే కార్యక్రమం జరుగుతుందని జగన్ తెలిపారు. కొత్తగా 16 మెడికల్ కళాశాలలు రానున్నాయని అన్నారు. స్కీల్ డెవలప్మెంట్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశామని వివరించారు. విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన మార్పుల కారణంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో 8.64శాతం పెరిగిందన్నారు.
ప్రభుత్వం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతుంటే చంద్రబాబుకు, ఎల్లో మీడియాకు అసూయ కలుగుతుందని ఆరోపించారు . అసూయను తగ్గించుకోకపోతే బీపీ, గుండెపోటు వచ్చి టికెట్ తీసుకుంటారని వ్యాఖ్యనించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రెండో విడత జగనన్న వసతి దీవెన కింద 10లక్షల 68 వేల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 1,024 కోట్లను వైఎస్ జగన్ జమ చేశారు.