ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ను మరో జిల్లాలో కలపకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ (ఏపీవీజేఏసీ) జలదీక్ష చేపట్టింది. ఇప్పుడున్న ప్రకాశంలో ఉంచకుండా దూరాన ఉన్న నెల్లూరు జిల్లాలో కలపాలని చూడటం దుర్మార్గమని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అయితే, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీవీజేఏసీ గత కొంతకాలంగా ఆందోళన చేపడుతున్నది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతమైన రామాయపట్నంలో విద్యార్థులు ‘జలదీక్ష’ నిర్వహించి తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఏపీవీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ ఆధ్వర్యంలో విద్యార్థులు రామాయపట్నం బీచ్లో సముద్రపు నీటిలో రెండు గంటలకు పైగా నిలబడి ఓడరేవును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థులు చదువులు పూర్తయ్యాక స్థానికంగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఉన్నారని, అయితే, ఇప్పుడు ఇలా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. రామాయపట్నంను ప్రకాశం జిల్లాలోనే కొనసాగించకుండా నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో మా ఆశలు అడియాశలయ్యాయని, తద్వారా ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని ఏపీవీజేఏసీ ఒంగోలు యూనిట్ కన్వీనర్ పీ కార్తీక్ అన్నారు.