అమరావతి : న్యూఇయర్ వేడుకల సందర్భంగా విజయవాడలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. ఆంక్షలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా వెల్లడించారు. ముఖ్యంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు. నగరంలో ఐదుగురు కంటే మించి గూమికూడరాదని తేల్చి చెప్పారు.
బెంచ్ సర్కిల్ పరిధిలోని రెండు వంతెనలు, దుర్గ వంతెన, సీవీఆర్ వంతెనలను శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు మూసివేస్తామని ప్రకటించారు. బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్లు, స్టార్ హోటళ్లలో వేడుకలు నిర్వహించే వ్యక్తులు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
కొవిడ్ కొత్త వేరియంట్ ప్రబలుతున్న దృష్ట్యా కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ వెల్లడించారు. కార్లు, బైకులు వేగంగా నడపటంపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు ఆయన తెలిపారు.