Kethu Viswanatha Reddy | ఒంగోలు : ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాకు చెందిన ప్రముఖ తెలుగు కథా రచయిత, సాహితీవేత్త కేతు విశ్వనాథ్ రెడ్డి(84) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. విశ్వనాథ్ రెడ్డితో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
విశ్వనాథ్ రెడ్డి రెండు రోజుల క్రితం ఒంగోలులోని ఆయన కుమార్తె ఇంటికి వెళ్లారు. కుమార్తె ఇంటి వద్ద ఉన్న సమయంలోనే విశ్వనాథ్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున 5:30 గంటలకు గుండెపోటుతో చనిపోయారు. విశ్వనాథ్ రెడ్డి మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కవులు, రచయితలు, సాహితీవేత్తలు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
విశ్వనాథ్ రెడ్డి స్వస్థలం.. వైఎస్సార్ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండల పరిధిలోని రంగసాయిపురం. ఆయన టీచర్గా తన వృత్తిని ప్రారంభించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా పని చేసి, పదవీ విరమణ పొందారు. సాహితీ రంగంలో విశ్వనాథ్ రెడ్డి చేసిన సేవలకు గానూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆయనను వరించింది.