అమరావతి : ఫోక్సో చట్టం కింద కేసు నమోదై జైలులో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. పీలేరు మండలం ఎర్రగుంపల్లి పంచాయతీ పరిధిలోని ముడుపుల వేములవారి పల్లెకు చెందిన రాజేశ్ నాయక్ (32) ఓ మైనర్పై అత్యాచారం చేసి గర్భవతి కారకుడయ్యాడని అతడిపై మార్చి 25న చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేసి అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంచారు.
ఈ రోజు తెల్లవారుజామున జైలులో రాజేశ్ నాయక్ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కొన ఊపిరితో ఉన్న అతడిని హుటాహుటిన పీలేరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. రాజేష్ మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.