అమరావతి : టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం(MLA Koneti Adimoolam) కు ఏపీ హైకోర్టు (High Court ) లో ఊరట లభించింది. ఓ మహిళ అతడిపై పెట్టిన లైంగిక వేధింపుల (Rape case) కేసును ఆమె ఉపసంహరించుకోవడంతో ఈ కేసును కోర్టు కొట్టి వేసింది. ఈనెల 5న ఆదిమూలంపై బలాత్కారం, బెదిరించి రేప్ చేయడంపై తిరుపతి ఈస్ట్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది.
బీమాస్ పారడైజ్ హోటల్లో తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను (Video Tapes) హైదరాబాద్లోమీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించించింది. ఈ విషయం ప్రసార సాధనాల్లో రావడంతో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
కేసు నడుస్తున్న క్రమంలో కేవీబీపురం మండలానికి చెందిన బాధిత మహిళ ఎవరూ ఊహించని విధంగా ఈనెల 20న హైకోర్టుకు హాజరై ఎమ్మెల్యేపై తాను పెట్టిన కేసు, అందులో పేర్కొన్న ఆరోపణలు అవాస్తవమని వివరించింది. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం గత శుక్రవారం విచారణ చేపట్టింది. మూడవ వ్యక్తి ప్రమేయంతోనే మహిళ కేసు పెట్టిందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసును కొట్టి వేయాలని కోరారు.
మరోవైపు బాధిత మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అంశాలన్నీ అవాస్తవమని, ఈ మేరకు నోటరీతో కూడిన అఫిడవిట్ను బాధిత మహిళ కోర్టుకు సమర్పించిందని, అందువల్ల ఈ కేసును కొట్టి వేయాలని మహిళ తరఫు న్యాయవాది జితేందర్ సైతం కోర్టులో వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు ఆదిమూలంపై కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.