అమరావతి : ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి మేరుగ నాగార్జున విడుదల చేశారు. ఎస్సీ గురుకులాల్లో ప్రవేశానికి 61 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాశారని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు కూడా చూపని శ్రద్ధ ప్రభుత్వం చూపుతోందని అన్నారు. రాష్ట్రంలోని హాస్టళ్లు, గురుకులాల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పెడితే టీడీపీ నాయకులు హైకోర్టుకు వెళ్లి నిలుపుదల చేశారని ఆయన తెలిపారు.
వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు తదితర వాటిని విజయవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు.