అమరావతి: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు కేంద్రాల్లో వింతలు, విశేషాలు చోటుచేసుకుంటున్నాయి. అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం తలమర్లవాండ్లపల్లిలో కౌంటింగ్ అధికారులకు ఓ వింత అనుభవం ఎదురైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓ మందుబాబు ఓటుతో పాటు ఓ చీటీని కూడా బ్యాలెట్ బాక్సులో వేశాడు.
అందులో ఏమని రాశాడంటే.. నల్లచెరువు మండలంలోని మద్యం దుకాణంలో చల్లని బీర్లు పెట్టాలని, అంతేకాకుండా వివిధ రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని చీటీలో రాసి తన సంతకాన్ని కూడా చేశాడు. అంతేకాకుండా ఇట్లు నల్లచెరువు యవత, మందుబాబుల అధ్యక్షుడు అని రాసి ఉంది. అందులో తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తం చేశాడు.
దీన్ని చదివిన ఓట్ల లెక్కింపు అధికారులు, సిబ్బంది ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. కౌంటింగ్ కేంద్రంలో నవ్వులు పూశాయి. ఈ విషయం బయట అందరికీ తెలియడంతో కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాకూడా రాస్తారా అంటూ మరికొందరు ముక్కున వేలేసుకున్నారు.