విశాఖపట్నం: గుజరాత్లోని సూరత్లో జాతీయ హిందీ దినోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల సందర్భంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) కి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. అలాగే, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రాజభాషా కీర్తి పురస్కారం లభించింది. హిందీని విజయవంతంగా అమలు చేసినందుకుగానూ ఆర్ఐఎన్ఎల్ వరుసగా నాలుగో సారి రాజభాషా కీర్తి పురస్కారాన్ని అందుకున్నది.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర ప్రముఖుల సమక్షంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నుంచి ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ ఈ అవార్డును అందుకున్నారు. హిందీ ఇన్-హౌస్ మ్యాగజైన్ విభాగంలో ఆర్ఐఎన్ఎల్ మ్యాగజైన్ ‘సుగంధ్’ మళ్లీ ఉత్తమ మ్యాగజైన్గా ఎంపికైంది. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ వైస్-ఛైర్మెన్ భర్తృహరి మహతాబ్ నుంచి ‘సుగంధ్’ ఎడిటర్, జనరల్ మేనేజర్ లలన్ కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. టౌన్ అధికారిక భాషా అమలు కమిటీ కూడా ‘సీ’ విభాగంలో రెండో బహుమతిని పొందింది. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నుంచి టీఓఎల్ఐసీ సభ్య కార్యదర్శి లలన్ కుమార్ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ టీమ్ను చైర్మన్ అతుల్భట్ అభినందించారు. ఈ అవార్డులను సంస్థతోపాటు సంస్థలోని ఉద్యోగులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.