తిరుపతి : అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన సోమవారం ఉదయం స్వామివారు శ్రీ రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై దర్శమిచ్చారు. మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఆలయ మాడ వీధుల్లో కోలాహలంగా వాహనసేవ జరిగింది.
వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. క్షీరసాగరమథనంలో ఉద్భవించిన కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిస్తూ కల్పవృక్షం ఇవ్వలేని ధర్మమోక్షాల్ని కూడా నేను అనుగ్రహిస్తానని తెలియజేస్తున్నారు.
అనంతరం స్వామి, అమ్మవార్లకు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం జరుగనున్నది. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు సర్వభూపాలవాహనంపై శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాధం, కంకణబట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.