Pawan Kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీటింగ్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, కాకినాడ ఎంపీ అభ్యర్థి సునీల్ను జనసేనలోకి ఆహ్వానించారు. దీనిపై మార్గాని భరత్ సెటైర్లు వేశారు. వైసీపీ అభ్యర్థులను జనసేనలోకి ఆహ్వానించడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. వాళ్ల చేతిలో ఓడిపోతామనే భావనతోనే పవన్ కళ్యాణ్ అలా మాట్లాడి ఉంటారని సెటైర్ వేశారు. తన వెనుక కాపు సామాజిక వర్గం ఉందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని అన్నారు. కానీ కాకినాడ పార్లమెంటులో 6 ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానం కాపు సామాజికవర్గానికి ఇచ్చామని తెలిపారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నుంచి కాపు సీట్లకు ఎన్ని సీట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు అని.. ఆయన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారని మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకసారి తమ పార్టీ నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తారని.. ఇంకోసారి లక్ష మెజారిటీతో గెలుస్తామని పవన్ కళ్యాణ్ అంటున్నారని చెప్పారు. అసలు ఆయన మైండ్సెట్ ఏంటో అర్థం కావడం లేదని.. తన మైండ్సెట్ ఏంటనేది ఆయన అయినా ఆలోచించుకోవాలని హితవు పలికారు. ప్రజలకు సేవ చేయడానికి, రాష్ట్రాన్ని మార్చేందుకే కదా రాజకీయాల్లోకి వచ్చింది.. మరి తన మనస్తత్వం ఎలా ఉందో ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేతుల్లో కీలుబొమ్మలాగే పవన్ వ్యవహరిస్తున్నారని సెటైర్ వేశారు. బీజేపీ పెద్దలు ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా వెళ్తా.. లేదంటే పిఠాపురంలో పోటీ చేస్తానని అంటున్నారని.. ఆయన మాటల్లో ఎంత మెచ్యూరిటీ ఉందో ఆలోచించుకోవాలని అన్నారు.