అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో వర్షాలు విరివిగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఏపీలోని వాతావరణ పరిస్థితులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఆదివారం రోజున ఉత్తర-దక్షిణ ద్రోణి ఏర్పడి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ వరకు సరాసరి సముద్ర మట్టం 0.9గా ఉండటంతో రానున్న మూడు రోజులపాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇది నిన్న రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో, ఇవాళ కోస్తా తమిళనాడు, పరిసర ప్రాంతాలకు విస్తరించిందని పేర్కొన్నది.
రానున్న మూడు రోజులపాటు ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రా ప్రాంతంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, ఇవాళ కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నది. మంగళవారం నాడు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉన్నదని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.