అమరావతి: రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ పేర్కొన్నది. ఏపీలోని ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచానా వేసింది. కర్నాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నది పొంగి ప్రవహిస్తున్నది. ఫలితంగా కృష్ణా రివర్ బేసిన్లోని శ్రీశైలం, ప్రకాశం బరాజ్లు నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్లోకి భారీ వరదలు రావడంతో 20 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 2.93 లక్షల క్యూసెక్కుల నీటిని స్పిల్వే ద్వారా వదులుతున్నారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడి.. రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికను భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతామరాజు, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే తిరిగి రావాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ సూచించారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడడంతోపాటు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉన్నదని ఐఎండీ పేర్కొంది. వరి, అరటి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండనున్నది. వీటిని దృష్టిలో ఉంచుకుని అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు పాత భవనాలు / ఇళ్లల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, చెరువులు, కాలువలు, నదులు, విద్యుత్ స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని ఐంఎడీ సూచించింది.