అమరావతి: పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ సముద్ర మట్టానికి 5.1 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఎత్తుకు వెళ్లేకొలది నైరుతి దిశగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా శుక్ర, శనివారాల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
తూర్పు పడమర ద్రోణి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి కోస్తా కర్ణాటక వరకు రాయలసీమ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు విస్తరించి శనివారం బలహీనపడింది. దాంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నది. ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొన్నది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉండాలని హెచ్చరించింది. రానున్న రెండు రోజులు అవసరం ఉంటేనే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు ప్రజలను కోరారు.