అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) టీడీపీ (TDP) లో చేరారు. టీడీపీ పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో చేరారు. ఈ సందర్భంగా పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రఘురామ సేవలను పార్టీ వినియోగించుకుంటుందని తెలిపారు.
ఆర్ఆర్ఆర్కు జిల్లాలోని ఉండి (Undi) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అవకాశం దక్కే అవకాశం ఉంది. అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు (Sitting MLA Ramaraj) కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నానని తనకే ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం వస్తుందని ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు.
2019లో జరిగిన ఎన్నికల్లో రఘురామ కృష్ణంరాజు నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కొద్ది నెలలకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఆర్ఆర్ఆర్ కు భేదాభిప్రాయాలు రావడంతో పార్టీకి దూరంగా ఉంటూనే పార్టీ వైఖరి, జగన్ అవలంభిస్తున్న విధానాలు ఎండగడుతు వస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు పార్టీ విధానాలకు కట్టుబడడం లేదని ఆరోపిస్తూ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అనేకమార్లు లోక్సభ స్పీకర్కు వినతిపత్రాలు అందజేశారు.
అదే సమయంలో కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ(CID) చేత కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. ఈ సమయంలో చంద్రబాబు ఆయనకు అండగా ఉండి అన్ని విధాలుగా సహకరించడంతో టీడీపీకి అనుకూలంగా ఉంటూ వస్తున్నారు. ఉండి నియోజకవర్గం మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా ఉండడంతో రఘురామరాజును అక్కడి నుంచి పోటీకి దింపనున్నట్లు సమాచారం. ఇక్కడ జరిగిన 17 ఎన్నికల్లో 8 సార్లు టీడీపీ 6 సార్లు కాంగ్రెస్, రెండుసార్లు్ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు.