(Raghurama Krishnam Raju) అమరావతి: తనపై సీబీఐ నమోదు చేసిన కేసుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. బ్యాంకుల రుణాలు ఎగవేత కేసులో రఘురామ కృష్ణరాజుతో పాటు 16 మందిపై సీబీఐ కేసు నమోదు చేసి ఛార్జిషీటు దాఖలు చేసింది. ఈ అంశం గత నాలుగేండ్లుగా పెండింగ్లో ఉన్నందున.. ఈ దశలో ఛార్జిషీటు నమోదు కావడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి అంశంపైనా న్యాయస్థానంలోనే సమాధానమిస్తానని శనివారమిక్కడ మీడియాతో చెప్పారు. రేపో మాపో జైలుకు వెళ్లే వారి మాటలను తాను పట్టించుకోనని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
మొత్తం లావాదేవీలు బ్యాంకుల ద్వారానే జరిగాయని, కొన్ని కంపెనీల బకాయిల గురించి తమకు తెలియజేశాయని చెప్పారు. ఇది కంపెనీల మధ్య జరిగిన సివిల్ వివాదమని, దీనిపై క్లారిటీతో కౌంటర్ దాఖలు చేస్తానని చెప్పారు. త్వరలో జైలుకు వెళ్లే వారి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రూ.947. 71 కోట్ల రుణాల మోసానికి సంబంధించి వైసీపీ రెబల్ ఎంపీ కె రఘురామకృష్ణంరాజు, ఆయనకు చెందిన కంపెనీ ఇండ్-భారత్ పవర్ (మద్రాస్) లిమిటెడ్తో పాటు మరో 15 మందిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. రఘురామ కృష్ణరాజు పై బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేయడంతో పాటు, దివాలా ప్రక్రియను కూడా ప్రారంభించమని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఆదేశించింది.