అమరావతి : ఏపీలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. విజయవాడలో వైఎస్సార్ తల్లీ బిడ్డ ఎక్స్ప్రెస్ ఏసీ నూతన వాహనాలను బెంజ్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య ఆసరా పథకం కింద తల్లీ బిడ్డలు ఆస్పత్రుల నుంచి సురక్షితంగా ఇంటికి చేరేందుకు 500 ఆధునిక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చామని సీఎం చెప్పారు.
తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ సేవల కోసం టోల్ఫ్రీ నెంబర్ 102 నంబర్ను ప్రవేశపెట్టామని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఎంతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. సిజేరియన్ ఆపరేషన్లకు రూ.3 వేలు, నేచురల్ డెలివరీల అయితే రూ.5వేలు ఇస్తున్నామని అన్నారు. గతంలో అరకొరగా వాహనాలు ఉండేవని, అందుబాటులో ఉండేవి కావని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న వైద్య సేవల వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు.