Srisailam | శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు పూజాధికాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. గురువారం ఉదయం చండీశ్వరపూజ మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం జరిపించినట్లు చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు తెలిపారు.
సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం వివిధరకాలైన ఎర్రబంతి, పచ్చబంతి, చామమంతి, కనకంబరాలు, డచ్ రోస్ అశోక పత్రాల మాలలు, నందివర్ధనం, గరుడ వర్దనం, కాగడాలు,అస్సెర్ గ్రాస్, గ్లాడియేలస్ మొదలగు పుష్పాలతో అలంకరించిన పుష్పపల్లకిలో భ్రామరీ సమేత మల్లికార్జునుడు భక్తులను కనువిందు చేశారు.
సాంప్రదాయ మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో గంగాధర మండపం మొదలుకొని నందిమండపం వరకు, నందిమండపం నుండి క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రుడి వరకు పురవీధుల్లో ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, జాంజ్పథక్, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
పుష్పపల్లకిలో విహరిస్తున్న ఆదిదంపతులను దర్శించుకున్నవారు కష్టాలను వీడి సుఖ సంతోషాలతో బాసిల్లుతారని ప్రధాన అర్చకులు తెలిపారు. గ్రామోత్సవంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు విరూపాక్షయ్య, విజయలక్ష్మి సుబ్బరాయుడు, ఈఈలు రామకృష్ణ, నర్సింహ్మరెడ్డి, ఏఈవోలు హరిదాసు, ఫణిందర్ప్రసాద్,మల్లికార్జునరెడ్డి, స్వాములు, సీఎస్వో అయ్యన్న, పర్యవేక్షకులు రవికుమార్, తదితర పాల్గొన్నారు.
రేపు గజ వాహనంపై శ్రీశైల ఆది దంపతులు..
శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్ర్తోక్త పూజలు నిర్వహించి సాయంత్రం గజ వాహనంపై గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఈవో పెద్దిరాజు తెలిపారు.