తిరుపతి : శ్రీ వేంకటేశ్వర పూర్హోమ్లోని కుష్టు రోగులు, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలోని వృద్ధులకు మరింత మెరుగైన సేవలు అందించాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అక్కారంపల్లి వద్ద ఉన్న శ్రీవేంకటేశ్వర పూర్హోమ్, శ్రీవేంకటేశ్వర కరుణాధామంలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్వీ పూర్హోమ్లోని రోగుల అవసరాలను గుర్తించి సౌకర్యాలను మెరుగుపర్చాలని సూచించారు. రోగులకు అవసరమైన మందులు, ఆహారపదార్థాల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.
రోగుల విశ్రాంతి గదులు, వంటగదులు ఆయన పరిశీలించారు. కరుణాధామంలో వృద్ధులతో నేరుగా మాట్లాడి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. వంటల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల భారీ వర్షాలకు పడిపోయిన ప్రహరీ మరమ్మతులను పూర్తి చేయాలని సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.వర్షాలకు కపిలేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో పడిపోయిన మండపం తొలగింపు పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆయన వెంట డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.