ఒంగోలు : ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద అలవులపాడు గ్రామంలో ఉన్న వెయ్యేండ్ల నాటి దుర్గా శిల్పాన్ని రక్షించాలని ఏపీకి చెందిన ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చాళుక్యుల కాలంలో 10వ శతాబ్దంలో రాతిపై చెక్కబడిన మహిషాసురమర్ధిని ఆకారంలో ఈ శిల్పం ఉన్నది. పెద ఆలవులపాడు గ్రామస్థులతోపాటు పరిసర గ్రామాల ప్రజలు పాలేటి గంగగా ఈ శిల్పన్ని ఆరాధిస్తుంటారు.
13వ శతాబ్దంలో కాటమరాజు, మనుమసిద్ధి వర్గాల మధ్య జరిగిన పోరాటాన్ని వివరించే ప్రముఖ జానపద కథ ‘కాటమరాజు కథ’తో ముడిపడి ఉన్న ఎర్రగడ్డపాడు, లింగాలకొండ, పెద అలవులపాడు గ్రామాలలోని చారిత్రక అవశేషాలను డాక్టర్ శివనాగి రెడ్డి డాక్యుమెంట్ చేస్తున్నారు. కాటమరాజుపై ప్రొఫెసర్ టీవీ సుబ్బారావు చేసిన పరిశోధనలను ప్రస్తావిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ జ్యోతి చంద్రమౌళి అందించిన సమాచారం మేరకు డాక్టర్ శివనాగిరెడ్డి ఆదివారం శిల్పాన్ని పరిశీలించి శిల్పకళకు గల చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు.
మహిషాసురుడి తలపై స్త్రీ దేవత నిలబడి తన ఎనిమిది చేతుల్లో శంఖ, చక్ర, ఖడ్గ, శూల, గద, దళాలను పట్టుకొని ఉన్నట్లుగా శిల్పం ఉన్నదని, ఈ శిల్పం తూర్పు చాళుక్యుల కాలం క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందినదని డాక్టర్ శివనాగిరెడ్డి చెప్పారు. ఏటా వేసవిలో స్థానికులు జరుపుకునే పండుగల సందర్భంగా రసాయనాలు ఉన్న రంగులు పూయడం వల్ల ఈ విగ్రహం శిథిలావస్థకు చేరుతున్నదని, చారిత్రక ప్రాధాన్యత తెలియకపోవడం వల్ల అతి పురాతన కాలం నాటివి దెబ్బతింటున్నాయని డాక్టర్ శివనాగిరెడ్డి, చంద్రమౌళి వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని ఈ వెయ్యేండ్ల నాటి శిల్పాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.