AP News | తండ్రి తిట్టాడన్న కోపంలో ఓ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. తన సైకిల్ తీసుకుని దాదాపు 100 కి.మీ. దూరం ఏకధాటిగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోయాడు. గొడవ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిన కొడుకు తిరిగిరాకపోవడంతో తండ్రి పోలీసులను ఆశ్రయించగా.. ఈ విషయం తెలిసింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రొద్దుటూరు సీఐ కొండారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దూటురుకు చెందిన ఓ తండ్రికి ఇద్దరు కుమారులు. వాళ్లిద్దరూ తరచూ గొడవపడుతుండటంతో తండ్రి మందలించాడు. దీంతో 9వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఇంట్లో నుంచి పారిపోయాడు. రాజుపాలెం, చాగలమర్రి మీదుగా రాత్రంతా ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా సైకిల్ తొక్కుతూ 100కి.మీ. దూరంలో ఉన్న నంద్యాలకు చేరుకున్నాడు. అక్కడ సైకిల్ను అమ్మేందుకు యత్నించగా.. దుకాణ యజమాని ప్రశ్నించాడు. దీంతో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో సైకిల్ను వదిలేసి వచ్చిన రైలు ఎక్కేశాడు. అలా చివరకు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ చేరుకున్నాడు.
మరోవైపు బాలుడు కనిపించడం లేదని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రొద్దుటూర్ వన్టౌన్ సీఐ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడి దగ్గర ఫోన్ లేకపోవడంతో ట్రైసింగ్ చేయడానికి వీలుకాలేదు. దీంతో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వీపునకు పుస్తకాల సంచి తగిలించుకుని సైకిల్పై వెళ్తున్న బాలుడిని గుర్తించి, పరిశీలించారు. నంద్యాల వెళ్లినట్లు గుర్తించి, అక్కడ లాడ్జీలు, హోటళ్లు, ఖాళీ ప్రదేశాల్లో వెతికారు. ఈ క్రమంలో నంద్యాల రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు సైకిల్ను గుర్తించారు. ఆ చుట్టుపక్కల ఆరా తీయగా రాయచూర్ రైలు ఎక్కినట్లుగా సమాచారం తెలిసింది. దీంతో రాయచూర్ వెళ్లి బాలుడిని ప్రొద్దుటూరు తీసుకొచ్చాడు.