తిరుమల : తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పేరూరులో నూతనంగా నిర్మించిన శ్రీ వకుళమాత ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. మంత్రి ,టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డితో కలిసి తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసి ఆలయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ నెల 23న వకుళమాత ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ,మహా సంప్రోక్షణ ఆవాహన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా సీఎంకు ఆహ్వానపత్రాన్ని అందజేశారు. అనంతరం టీటీడీ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు, వస్త్రాన్ని సీఎంకు అందజేసి వేద ఆశీర్వచనం ఇచ్చారు.