ప్రకాశం: టంగుటూరులో రెండు నెలల క్రితం జరిగిన జంట హత్యల కేసులో పురోగతి కనిపిస్తున్నది. ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నిందితులిద్దరూ కందూకూరుకు చెందిన వారిగా అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
టంగుటూరులో బంగారం వ్యాపారి జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖనలను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 3 న రాత్రి జరిగింది. రవికిషోర్ సింగరాయకొండ రోడ్డులో ఆర్కే జ్యూయలర్స్ పేరుతో బంగారం దుకాణం నిర్వహిస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో భార్యకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దాంతో గాబరా పడిపోయిన ఆయన కుమార్తెకు ఫోన్ చేశాడు. కుమార్తె నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో ఆయన వెంటనే ఇంటికి వెళ్లి చూడగా భార్య శ్రీదేవి, కుమార్తె వెంకట లేఖన గొంతు కోసిన స్ధితిలో తీవ్ర రక్తస్రావమై అచేతనంగా పడివున్నారు.
ఈ విషయాన్ని రవికిషోర్ చుట్టుపక్కల వారికి చెప్పాడు. వారి ద్వారా సమాచారం అందుకున్న సింగరాయకొండ పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా మారి గాలింపు జరిపారు. చివరకు వీరి హత్యలో కందుకూరుకు చెందిన ఒకరు, జరుగుమల్లికి చెందిన ఒకరు పాలుపంచుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే, వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.