Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం దేవస్థానం అధికారులు, పోలీసు శాఖ అధికారులు సమీక్షించారు. సోమవారం (ఏప్రిల్ 8) సాయంత్రం జరుగనున్న ప్రభోత్సవం, రాత్రి జరిగే వీరాచార విన్యాసాలు – అగ్నిగుండ ప్రవేశం, మంగళవారం (ఏప్రిల్ 9) న జరిగే రథోత్సవ నిర్వహణ, భక్తుల రద్దీకి అనుగుణంగా కల్పించాల్సిన వసతులు, సౌకర్యాలతోపాటు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని, తొక్కిసలాట జరుగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత విభాగాల సిబ్బందిని సమావేశంలో పాల్గొన్న అధికారులు ఆదేశించారు. అలాగే ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ముఖ్యంగా ప్రభోత్సవం, వీరాచార విన్యాసాలు- అగ్ని గుండ ప్రవేశం, రథోత్సవం సజావుగా సాగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాదిరిగానే ప్రభోత్సవం, రథోత్సవ నిర్వహణకు అన్ని రకాల అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రభోత్సవం, రథోత్సవాలను భక్తులంతా సౌకర్యవంతంగా వీక్షించడానికి వీలుగా భద్రతా చర్యలు చేపట్టాలని చెప్పారు. తొక్కిసలాట లేకుండా తగు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
శివదీక్షా శిబిరాల వద్ద నిర్వహించే వీరాచార విన్యాసాలు – అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమ నిర్వహణపై అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం వద్దే ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రథమ చికిత్సా కేంద్రంలో అవసరమైన అన్ని ఔషధాలను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. అలాగే అగ్ని మాపక యంత్రం (ఫైరింజన్) కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు.
ఉగాది మహోత్సవాలు ముగిసే వరకూ కమాండ్ కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ల్లోని స్క్రీన్ల ద్వారా క్షేత్ర పరిధిలోని అన్ని ప్రదేశాలను జాగ్రత్తతో పరిశీలిస్తుండాలని చెప్పారు. ఈ సిబ్బంది ఎప్పటికప్పుడు అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపడుతుండాలని అన్నారు.
భ్రమరాంబా సదన్ అతిథి గ్రుహంలో జరిగిన సమీక్షా సమావేశంలో నంద్యాల జిల్లా అదనపు ఎస్పీ కే ప్రవీణ్ కుమార్, దేవస్థానం ఈఓ డీ పెద్ది రాజు, ఆత్మకూరు డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, దేవస్థానం ఇంజినీరింగ్, ఆలయం, భద్రతా విభాగం అధికారులు, స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించిన తర్వాత ప్రభోత్సవం, రథోత్సవం జరిగే ప్రధాన వీధి, శివ దీక్షా శిబిరాల్లోని వీరాచార విన్యాసాలు- అగ్ని గుండ ప్రవేశం జరిగే ప్రదేశాన్ని అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అగ్ని గుండం జరిగే ప్రదేశం చుట్టూ పటిష్టమైన కంచె (మెష్) ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాలను భక్తులు సౌకర్యవంతంగా వీక్షించడానికి వీలుగా గతంలో మాదిరిగానే ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయాలని చెప్పారు. క్షేత్ర పరిధిలోని పలు పార్కింగ్ ప్రదేశాల్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.