Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మంగళవారం భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో మార్గశిరమాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు, అభిషేకాలు ఘనంగా జరిపించినట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామిఅమ్మవార్లను పల్లకిలో ఆశీనులజేసి ప్రత్యేక పూజల అనంతరం క్షేత్ర గిరిప్రదక్షిణ నిర్వహించారు.
అర్చక వేదపండితులు భక్తులు శివనామస్మరణ చేస్తూ నంది మండపం నుండి బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా సాగిన గిరిప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పౌర్ణమి సంధ్యా సమయంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అష్టోత్తర నామావళిని అర్చకులు పఠించారు.
అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేబు చేసి ఆలయ ప్రదక్షిణగా అర్చక వేదపండితులు ఉత్సవం జరిపించారు. అదే విధంగా క్షేత్రపాలకుడు బయలువీరభద్రస్వామికి శాస్త్రోక్తంగా వార పూజలు జరిపించి భక్తులకు తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఈవో మోహన్ తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈవో పెద్దిరాజు అన్నారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్షకుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి శ్రీ చక్రార్చన కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు www.srisailadevasthanam.org ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈవో పెద్దిరాజు కోరారు.