Srisailam | శ్రీశైల భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రంలో ఫాల్గుణ మాస పౌర్ణమి ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దీంతోపాటు లోక కళ్యాణార్ధం పరివార దేవతలకు అర్చనలు అభిషేకాలు ఘనంగా జరిపించినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆలయ ప్రాకారంలో స్వామి అమ్మవార్లను పల్లకిలో ఆశీనులజేసి ఆలయ ప్రదక్షణలుచేసి క్షేత్ర గిరిప్రదక్షిణ చేశారు. అర్చక వేదపండితులు నందిమండపం నుండి బయలువీరభద్రస్వామి ఆలయం మీదుగా శివనామస్మరణ చేస్తూ సాగిన గిరి ప్రదక్షిణలో యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పౌర్ణమి సంధ్యా సమయంలో శ్రీభ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకుమార్చన చేసి ఊయల సేవ, పల్లకి సేవ జరిపించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ఊయలలో స్వామి అమ్మవార్లను ఆశీనులను చేసి అర్చకులు అష్టోత్తర నామావళిని పఠించారు. ఉభయ దేవాలయాల్లో పౌర్ణమి ప్రత్యేక పూజా కార్యక్రమాలో భక్తులు పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఏఈఓ హరిదాసు తెలిపారు.
వివిధ ప్రాంతాల్లో ఉండే భక్తుల సౌకర్యం కోసం నిర్వహిస్తున్న పరోక్షసేవకు విశేష ఆదరణ లభిస్తుందని ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. నిత్య ఆర్జిత సేవలతోపాటు ప్రతి పౌర్ణమికి భ్రమరాంబ అమ్మవారికి జరిపే లక్ష కుంకుమార్చనలో భక్తులు తమ గోత్రనామాలను ముందుగా నమోదు చేయించుకుని అమ్మవారి శ్రీ చక్రార్చన కుంకుమ ప్రసాదాన్ని పొందుతున్నారని తెలిపారు. భక్తులు www.srisailadevasthanam.org ఆన్లైన్ వెబ్సైట్లో పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఈఓ డీ పెద్దిరాజు కోరారు.
శ్రీశైల దేవస్ధానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి సికింద్రాబాద్ వాసి బొమ్మ కావ్యశ్రీ రూ.లక్ష విరాళం అందజేశారు. ఆదివారం దేవస్థానం పర్యవేక్షకురాలు హిమబిందుకు విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. ఆ తర్వాత దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.