తిరుమల : రేపటి నుంచి 15 వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున
తరలివచ్చే అవకాశం ఉంటుందని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేసింది. వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీ తోపాటు పండుగతో కూడిన వరుస సెలవులు ఉండడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ఏర్పాట్లు చేస్తుంది.
పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబర్ 18న ప్రారంభమై అక్టోబర్ 17వ తేదీ ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమల యాత్రికుల రద్ధీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావలసిందిగా టీటీడీ కోరింది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాలలో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని వివరించారు.
యాత్రికులు దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్మెంట్లలో , క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండటానికి సంసిద్ధత ఓపికతో రావాలని సూచించింది.