కాకినాడ జిల్లాలో ఓ పోస్ట్ మాస్టర్ పక్కా ప్లాన్ వేసి వినియోగదారులకు కుచ్చుటోపీ పెట్టాడు. రాత్రికి రాత్రేకే లక్షలతో జంపయ్యాడు. ఈ పోస్టాఫీస్లో రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారంతా పోస్ట్ ఆఫీస్ ఎదుట గొల్లుమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ ఘరానా మోసం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కేశవపురంలో చోటుచేసుకున్నది.
పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం కేశవపరంలో పోస్ట్ఆఫీస్ ఉన్నది. ఈ పోస్టాఫీస్కు పోస్ట్మాస్టర్గా సుబ్రహ్మణ్యం మూడేండ్లుగా పనిచేస్తున్నాడు. నిత్యం వచ్చే వారిని పలుకరిస్తూ వారి బాగోగులు తెలుసుకుంటూ ఉండే సుబ్రహ్మణ్యం.. పోస్టాఫీస్ వినియోగదారులకు చిరపరితుడిగా మారాడు. పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి యోజన పథకం పేరుతో నెలనెలా మదుపు చేసిన డబ్బును తన అకౌంట్లో వేసుకున్న సదరు పోస్ట్ మాస్టర్.. రాత్రికి రాత్రే చెప్పాపెట్టకుండా పెట్టాబేడా సర్దుకుని పరారయ్యాడు. విషయం తెలుసుకున్న వినియోగదారులు కేశవపురం పోస్టాఫీస్ వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని అధికారులకు వేడుకున్నారు.
అలాగే, ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం డబ్బులను కూడా కాజేసినట్లు పలువురు మహిళలు ఆరోపించారు. తాము డబ్బు జమ చేసిన సందర్భాల్లో పాసు బుక్కులు వెంటనే ఇవ్వకుండా కాలాయాపన చేసేవాడని, అమ్మ ఒడి పథకం డబ్బులకు చెక్కులిస్తానన్నాడని స్థానికులు చెప్పారు. పాస్బుక్కులో స్టాంప్ వేయకుండా మమ్మల్ని మోసం చేశాడని వారు ఫిర్యాదు చేశారు. అకౌంట్ నంబర్ వేయకుండానే పే ఇన్ స్లిప్ రాసి డబ్బులు విత్డ్రా చేసినట్లు కౌంటర్ ఫాయిల్ ఇచ్చినట్లు పలువురు చెప్పారు. తాము ఐదేండ్లుగా నగదు జమ చేస్తున్నా ఎలాంటి పాస్ బుక్కు గానీ, కౌంటర్ ఫాయిల్స్గానీ ఇవ్వలేదని కొందరు మహిళలు వాపోయారు. బాధితులు ఆందోళన చేస్తుండటంతో పోలీసులు అక్కడికి చేరుకుని.. బాధితుల నుంచి వివరాలు అడిగి తెల్సుకున్నారు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు.