అమరావతి : వైసీపీ నాయకుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి (Posani Krishnamurali) టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra babu) పై మరోసారి విరుచుకుపడ్డారు. కాపులకు పవన్కల్యాణ్ మోసం చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్లో మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించి కాపు కులస్థుల కోసమే మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు.
వంగవీటి రంగా(Vangaveeti Ranga) ను చంపించింది చంద్రబాబే అని వ్యాఖ్యనించారు. ఈ విషయం రంగా తనయుడికి, ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. రంగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో సుమారు 70 ఎమ్మెల్యే సీట్లను ప్రభావితం చేసే నాయకుడని వెల్లడించారు. కాపులకు వంగవీటి పెద్ద హీరో అని కొనియాడారు. తనకు ప్రాణహాని ఉందని అప్పట్లో సీఎం ఎన్టీఆర్(NTR) , హోం మినిస్టర్ కోడెలకు సెక్యూరిటీ కోసం రంగా రిక్వెస్ట్ పెట్టుకున్నాడని, చంద్రబాబు వల్ల రంగాకు భద్రత రాలేదని ఆరోపించారు.
రంగా ఉంటే సీఎం అయిఉండేవాడని అన్నారు. కాపు కులం (Kapu Caste) నుంచి వచ్చిన పవన్కల్యాణ్పై కాపులు ఎంతో నమ్మకం పెట్టుకోగా చంద్రబాబుతో పొత్తులు కుదుర్చుకుని కాపులకు దగా చేశారని విమర్శించారు. రంగా తర్వాత కాపు కులంలో పవన్ సీఎం అవుతాడని కాపులు నమ్మారని తెలిపారు. కాపులు రౌడీలు గుండాలు అన్న చంద్రబాబుకు ఓటు వేయాలని పవన్ చెబుతున్నాడని ఆరోపించారు. రంగాను అభిమానించే వారు ఎవరైనా సైకిల్కి ఓటు వేయకండని పిలుపునిచ్చారు.