అమరావతి : నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన కేసుపై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ కొనసాగింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు స్టే అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.
విధులకు ఆటంకం కలిగించడంతో పాటు తమపై దాడి చేశారని ఏపీ పోలీసులు రఘురామ, అతని తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గిచ్చబౌలి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, ఏపీ సీఎం జగన్పై కుట్రపూరితంగా ఆరోపణలకు పాల్పడుతున్న ఉద్దేశంతో ఏపీ పోలీసులు రఘురామను అరెస్టు చేసి విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో పోలీసులు తనను ఎక్కడ అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ఎంపీ ఏపీకి రాకుండా ఢిల్లీలోనే ఉంటూ ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు. ఈ సమయంలో అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ తన నియోజకవర్గంలో పర్యటించేందుకు వస్తున్న సందర్భంగా హైదరాబాద్కు ఎంపీ రఘురామ చేరుకున్నారు.
అయితే తనను అరెస్టు చేసేందుకు వచ్చారేమోనన్న అనుమానంతో ఏపీ పోలీసులపై రఘురామ, అతడి తనయుడు, సెక్యూరిటీ సిబ్బంది చేయిచేసుకున్నారని, విధులకు ఆటంకం కలిగించారని సీఆర్పీఎఫ్కు చెందిన కానిస్టేబుల్, ఏఎస్ఐ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.